హైదరాబాద్ నగరంలో తెరుచుకోని చలివేంద్రాలు !

హైదరాబాద్ నగరంలో తెరుచుకోని చలివేంద్రాలు !
  • గతేడాది దవాఖానలు, బస్టాండ్ల వద్ద ఏర్పాటు చేసిన వాటర్​బోర్డు  
  • ఎండలు దంచి కొడుతున్నా    ఆ ఆలోచనే లేదు 
  • పాత క్యాంపుల్లో వేస్ట్​గా పడి ఉన్న ఫ్రిజ్ లు, కూలర్లు. 
  • బాటసారులు, డ్రైవర్లు,  ప్రయాణికులు, బిచ్చగాళ్ల తిప్పలు  

హైదరాబాద్ ​సిటీ, వెలుగు :  నగరంలో ఎండాకాలం వచ్చిందంటే చాలు చౌరస్తాలు, బస్టాండ్లు, దవాఖానల వద్ద చల్లని తాగునీరందించే వాటర్​బోర్డు చలివేంద్రాలు కనిపిస్తూ ఉండేవి. గత వేసవిలోనూ వాటర్​బోర్డు మార్చి మొదటి వారంలోనే చాలాచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతోమంది దాహాన్ని తీర్చింది. క్యాంపుల్లో బోర్డు సిబ్బందిని, అధికారులను భాగస్వాములను చేసి విజయవంతంగా నడిపించింది.

కానీ, ఈసారి మార్చి నెల ముగుస్తున్నా వాటర్​క్యాంపుల జాడ కనిపించడం లేదు. దీంతో గత ఏడాది ఏర్పాటుచేసిన చలివేంద్రాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అందులో ఏర్పాటు చేసిన రిఫ్రిజిరేటర్లు పనికి రాకుండా పోతున్నాయి. 

క్యాంపులకు తాళం

గత ఎండాకాలంలో వాటర్​బోర్డు ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో కుండలకు బదులుగా వాటర్​కూలర్లను ఏర్పాటు చేశారు. రోడ్లపై వెళ్లే వారికి, బిచ్చగాళ్లకు, ప్రయాణికులకు, ఆటోడ్రైవర్లకు చల్లని నీటిని అందించారు. ముఖ్యంగా బస్టాండ్లు, దవాఖానల వద్ద ఏర్పాటు చేయడంతో పేషెంట్ల బంధువులు, దవాఖానకు వచ్చే రోగులు చల్లని నీళ్లు తాగగలిగారు.

సిటీఓని బంజారాహిల్స్​రోడ్​నంబర్​1 బస్టాండ్​​ వద్ద, బసతతారకం క్యాన్సర్​హాస్పిటల్, నాంపల్లి, కోఠి, టాంక్​బండ్​, దిల్​సుఖ్ నగర్, సికింద్రాబాద్​స్టేషన్, పంజాగుట్ట, మెహదీపట్నం, చార్మినార్​ వంటి అనేక ప్రాంతాల్లో కలిపి మొత్తం 65 పాయింట్లలో వాటర్​బోర్డు చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ క్యాంపులన్నీ తాళాలు వేసి కనిపిస్తున్నాయి. కొన్నింటిలో కూలర్లు, డ్రమ్ములు పడావ్​పడి ఉండగా, మరికొన్ని క్యాంపుల నుంచి కూలర్లను బోర్డు ఆఫీసుకు తరలించారని సిబ్బంది చెప్తున్నారు. 

వచ్చే నెల ప్రారంభిస్తాం

వాటర్​ బోర్డు చలివేంద్రాలు ఏర్పాటు కాని విషయాన్ని బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా బోర్డు ఆపరేషన్స్​ డైరెక్టర్​ అమరేందర్​రెడ్డి మాట్లాడుతూ ఈ విషయం తమ పరిశీలనలో ఉందన్నారు. ఏప్రిల్​ మొదటి వారంలో తిరిగి వాటర్​ క్యాంపులను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. గత ఏడాది ఎక్కడెక్కడ ఏర్పాటు చేశామో వాటితో పాటు, అవసరమైన చోట్ల కొత్త క్యాంపులను కూడా ప్రారంభిస్తామన్నారు.